వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఈ నెల లో నిర్వహించే బక్రీద్ పండుగ నేపథ్యం లో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, పశువుల అక్రమ రవాణా మరియు చట్టవిరుద్ధ వధ నియంత్రణ కోసం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినదని జిల్లా ఎస్పీ నితిక పంత్ ఐపీఎస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని సున్నిత ప్రాంతాలు, అంతర్రాష్ట్ర మరియు జిల్లా సరిహద్దు ప్రాంతాలలో మొత్తం 11 ప్రాంతాలలో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ చెక్ పోస్టులు 24×7 పనిచేస్తూ పశువుల అక్రమ రవాణాపై నిఘా ఉంచనున్నయని తెలిపారు.పశువుల రవాణా, కొనుగోలు, విక్రయాలు, వధకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన చట్టాలు, నిబంధనలు మరియు అనుమతులు తప్పనిసరిగా పాటించాలని సంబంధిత వ్యాపారులు, రవాణాదారులు మరియు ప్రజలకు సూచించడమైనది.ఆవులను వధించడం చట్టరీత్యా నేరం అని, సంబంధిత చట్టాల ప్రకారం ఆవుల వధ, అక్రమ రవాణా లేదా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్పీ హెచ్చరించారు.అదేవిధంగా, పశువుల రవాణా మరియు వధకు ముందు సంబంధిత వెటర్నరీ డాక్టర్ నుండి తప్పనిసరిగా అనుమతి/సర్టిఫికేట్ పొందాలి. వెటర్నరీ వైద్యులచే జారీ చేయబడిన ఫిట్ ట్రాన్స్పోర్ట్ సర్టిఫికేట్ లేకుండా పశువుల రవాణా చేయరాదని అన్నారు.జిల్లా ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి ఏమనగా, పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలి. సమాచారం అందించడానికి జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా పి సి ర్ కంట్రోల్ – కుమురంభీం ఆసిఫాబాద్ కంట్రోల్ నెంబర్ అందుబాటులో ఉంచడమైనది.పీసీర్ కంట్రోల్ ఫోన్ నెంబర్: 8712670557 ప్రజలు, సామాజిక సంస్థలు మరియు ఇతర వర్గాలు సమాచారం ఇవ్వడంలో మాత్రమే సహకరించాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని స్వయంగా వాహనాలను అడ్డగించడం, తనిఖీలు నిర్వహించడం, లేదా వ్యక్తులపై చర్యలు తీసుకోవడం వంటి చర్యలు చేయరాదు.కొన్ని సంస్థలు లేదా వ్యక్తులు స్వచ్ఛందంగా వాహనాలను అడ్డగించడం లేదా జోక్యం చేసుకోవడం వలన శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. అటువంటి చర్యలు చట్టపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రజలు పూర్తిగా నివారించాలి.సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం, పుకార్లు లేదా రెచ్చగొట్టే పోస్టులు చేయరాదని హెచ్చరించడమైనది. ఎటువంటి అనుమానాస్పద పరిస్థితి గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకునేందుకు జిల్లా ప్రజలు, మత పెద్దలు, వ్యాపార వర్గాలు మరియు సామాజిక సంస్థలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్పీ తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం