వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని మనోవికాస్ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి హాజరై విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి నోట్బుక్స్, పెన్నులు, పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కూడా ఆ యాత్ర కీలక పాత్ర పోషించిందన్నారు.అలాగే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలను అణచివేయడానికి వివిధ సంస్థలను ఉపయోగిస్తూ రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు.దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని, ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా, పట్టణ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మైనారిటీ, సేవాదళ్, అనుబంధ సంఘాల నాయకులు, సోషల్ మీడియా వారియర్స్, బూత్ ఇన్చార్జ్లు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం