వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 27: రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మందమర్రి పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 100 కిలోల నకిలీ పత్తి విత్తనాలతో పాటు వాటి రవాణాకు ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.మందమర్రి ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, మందమర్రి పోలీసులు కలిసి శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో జాతీయ రహదారి-363లోని అందుగులపేట్ శ్రీ కన్వెన్షన్ హాల్ సమీపంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న ముగ్గురిని ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద ఎలాంటి ధ్రువీకరణ లేబుళ్లు, బిల్లులు లేని 100 కిలోల లూజ్ పత్తి విత్తనాలు లభించాయి. దీంతో వాటిని నకిలీ విత్తనాలుగా గుర్తించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.అరెస్టయిన వారిలో పాత మంచిర్యాల మధురనగర్కు చెందిన మాకినేని రాఘవేంద్ర (39), మందమర్రి బురదగూడెంకు చెందిన కట్ట నరేష్ (41), పుట్టగంటి పవన్ కుమార్ (39) ఉన్నారు. వారి వద్ద నుంచి అపాచీ, టీవీఎస్ ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అమాయక రైతులను నకిలీ విత్తనాలతో మోసం చేసే అక్రమ వ్యాపారులపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు.ఈ నకిలీ విత్తనాల రవాణా ముఠాను చాకచక్యంగా పట్టుకున్న మందమర్రి ఎస్ఐ నరేష్తో పాటు పోలీసు కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాకేష్, చైతన్య, మహేందర్, సంతోష్లను ఉన్నతాధికారులు అభినందించారు.
Reporter
వాస్తవ గమ్యం