వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కోటపల్లి (మే 17): అర్ధరాత్రి వేళ ఆదివాసీల ఇండ్లు కాలిపోవడానికి కారకులైన పెత్తందార్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్స గ్రామంలో ప్రమాద స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించి, బాధితులను పరామర్శించారు.మహారాష్ట్ర నుండి వలస వచ్చి ఇక్కడ వ్యవసాయ పాలేరుగా జీవిస్తున్న సిడం లచ్చన్న, సిడం రాకేష్ల అద్దె ఇల్లు మే 5న జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. గ్రామానికి చెందిన బీరం భాస్కర్ రెడ్డి తన పెరట్లోని చెత్తను కాల్చి, నిప్పులు ఆర్పకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, బాధితులు కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడ్డారని పున్నం తెలిపారు. ఈ ప్రమాదంలో రూ. 2.77 లక్షల నగదు, 10 తులాల వెండి బూడిదయ్యాయన్నారు.బాధితులను ఆదుకోవాల్సింది పోయి యజమాని శెనిగరపు మల్లారెడ్డి మానసికంగా హింసించడం దుర్మార్గమని, ఘటన జరిగి 10 రోజులు దాటినా మంత్రి వివేక్, పోలీసులు స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. అధికారులు స్పందించి బాధితులకు నష్టపరిహారం అందించి, న్యాయం చేయాలని, లేనిపక్షంలో బీరం భాస్కర్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తలండి ముత్తయ్య, ఆత్రం సంపత్, కోర్తే సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం