వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులో గల పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్ను సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రారంభించారు.ఈ కేంద్రీకృత వంటశాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన, పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించనున్నారు. అత్యాధునిక సాంకేతికతతో, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ కిచెన్ను ఏర్పాటు చేశారు.అనంతరం పద్మనాయక ఫంక్షన్ హాల్లో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన. సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఏ బిడ్డా అర్ధాకలితో బడికి వెళ్లకూడదన్నదే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వ సంకల్పం. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు. మానవ వనరులే రాష్ట్ర సంపద. ప్రతి విద్యార్థిని సానబెట్టిన వజ్రంలా తీర్చిదిద్ది, ప్రపంచానికి దిశానిర్దేశం చేసే స్థాయికి తీసుకెళ్లాలన్నదే మా లక్ష్యం” అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.మంచిర్యాల నియోజకవర్గంలో ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్కలకు మంచిర్యాల ప్రజల తరఫున ఎమ్మెల్యే హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ చైర్మన్, సభ్యులు, సింగరేణి సంస్థ అధికారులు, డీసీపీ భాస్కర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం