వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : లక్షెట్టిపేట, జూన్ 25: జిల్లాలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన విద్య,పారదర్శక పరిపాలన అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పష్టం చేశారు. గురువారం లక్షెట్టిపేట మండలంలో పలు ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా సందర్శించిన ఆయన, ఆసుపత్రులు, విద్యాసంస్థలు,ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాల అమలును క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ముందుగా లక్షెట్టిపేట 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్, వార్డులు, ల్యాబొరేటరీ, వైద్య రికార్డులు, ఆసుపత్రి పరిశుభ్రతను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీసిన ఆయన, ప్రభుత్వ ఆసుపత్రులను ప్రజల నమ్మక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు, వైద్య సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని, అత్యాధునిక వైద్య పరికరాలు, అవసరమైన సదుపాయాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి తీసుకువస్తోందని తెలిపారు.వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. అవసరమైన మందులు ఎల్లప్పుడూ నిల్వ ఉంచడంతో పాటు వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భోజనశాల, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేసి విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన విద్య అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు.తదుపరి వెంకటరావుపేట గ్రామంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని తహసీల్దార్తో కలిసి పరిశీలించిన కలెక్టర్, బూత్ స్థాయి అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, వివరాల నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.ఆ తర్వాత మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్, తరగతి గదులు, కళాశాల ఆవరణను పరిశీలించారు. విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు అమలు చేస్తోందని, విద్యార్థుల నమోదు సంఖ్య పెంపుతో పాటు విద్యా ప్రమాణాల మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు.ప్రజారోగ్యం, విద్యాాభివృద్ధి, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి సంబంధించిన మూడు కీలక రంగాలపై ఒకేరోజు సమగ్ర సమీక్ష నిర్వహించిన కలెక్టర్ కుమార్ దీపక్, ప్రభుత్వ సేవల నాణ్యత పెంపుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
Reporter
వాస్తవ గమ్యం