వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి,జూన్ 26 : గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రాజకీయ జోక్యం పెరగడంతో సింగరేణి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఆరోపించారు. మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనతో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వైఖరిపై విమర్శలు చేశారు.సింగరేణి కార్మికుల్లో టిబీజీకేఎస్కు ఆదరణ లేకపోవడం వల్లే గత యూనియన్ ఎన్నికల్లో ఆ సంఘం పోటీ చేయలేదని అన్నారు.ముఖ్యమంత్రి కుమార్తె టిబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ సింగరేణి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.ఇసుక రీచ్ల పేరుతో బాల్క సుమన్ ఈ ప్రాంత వనరులను దోచుకున్నారని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు నమోదు చేసి వేధించిన చరిత్ర ఆయనదేనని ఆరోపించారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ప్రకటించిన ఓపెన్కాస్ట్ గనులకు బదులుగా కొత్త భూగర్భ గనుల ఏర్పాటు హామీ అమలు కాలేదని విమర్శించారు.సింగరేణి ప్రాంత ఆస్తులను ధ్వంసం చేసేలా స్థానిక నాయకులు, యువకులను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని రఘునాథ్ రెడ్డి అన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి సోలార్ ప్లాంట్తో పాటు మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు చేస్తున్న కృషిని ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.కార్మిక శాఖ మంత్రిగా గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడంలో, సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల వేతనాల పెంపులో మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఏటీసీ సెంటర్ల ఏర్పాటుతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.జర్మనీలో ఉపాధి అవకాశాల కోసం సింగరేణి సంస్థ సహకారంతో రాష్ట్రంలోనే తొలిసారిగా మందమర్రిలో టామ్కామ్ ఆధ్వర్యంలో జర్మన్ భాష శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారని రఘునాథ్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, పట్టణ కమిటీ నాయకులు, యూత్ కాంగ్రెస్, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం