వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులందరూ ఈ నెల 31వ తేదీలోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు సూచించారు.శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని అదనపు కలెక్టర్ చాంబర్లో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ శ్రీకళతో కలిసి మండల రేషన్ షాప్ డీలర్ల సంఘం ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రేషన్ కార్డుల్లో నమోదైన లబ్ధిదారుల వివరాల పారదర్శకతను నిర్ధారించడం, నకిలీ లబ్ధిదారులను గుర్తించి తొలగించడం, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ రాయితీ ప్రయోజనాలు నిరంతరాయంగా అందేలా చేయడం కోసం ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసిందని తెలిపారు.జిల్లాలో ఇంకా గణనీయమైన సంఖ్యలో లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేయలేదని పేర్కొంటూ, మండల స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి జిల్లాలో 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడు స్వయంగా సంబంధిత లేదా సమీపంలోని ఏదైనా రేషన్ దుకాణానికి వెళ్లి ఈ-పోస్ యంత్రం ద్వారా వేలిముద్రలు నమోదు చేసి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు.గడువులోపు ఈ-కేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు భవిష్యత్తులో రేషన్ పంపిణీ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున, జిల్లాలోని రేషన్ కార్డు దారులందరూ వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను నిరంతరాయంగా పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ వి. రాములు కోరారు.ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ అధికారులు, మండల రేషన్ షాప్ డీలర్ల సంఘం ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం