వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జూన్ 25: మంచిర్యాల–పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించడం కలకలం రేపింది. ట్రాక్ పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు పరిశీలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోయి ఉండవచ్చని లేదా ఇతర కారణాలతో మృతి చెందిన ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటనకు గల ఖచ్చితమైన కారణాలు దర్యాప్తులో తేలనున్నాయని తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదికి తరలించి భద్రపరిచారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో ఆయన వివరాలు తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు, మృతుడిని ఎవరైనా గుర్తిస్తే లేదా అతనికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే 96186 89879, 87126 58596 నంబర్లకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. మృతుడి కుటుంబ సభ్యులు లేదా బంధువులు ముందుకు వస్తే తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపగా, రైల్వే మార్గాల్లో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Reporter
వాస్తవ గమ్యం