వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు పార్కులో మహిళలు, యువతుల భద్రతకు భంగం కలిగించే వారిపై షీ టీమ్ సోమవారం ఆకస్మికంగా డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. షీ టీమ్ ఎస్సై హైమ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో పార్కులో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, వెక్కిలి చేష్టలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళలు, బాలికలను వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం, ఈవ్టీజింగ్ వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హైమ హెచ్చరించారు.మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే షీ టీమ్ లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజా ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు ఇలాంటి డెకాయ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ ఆపరేషన్లో షీ టీమ్ సిబ్బంది శ్రవణ్, శ్రీలత పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం