Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, పట్టణంలోని పాలచెట్టు క్షేత్రంలో వెలసిన పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయ అర్చకులు కృష్ణ కాంత ఆచార్యులు ఆధ్వర్యంలో సుందరకాండ హవనం, నాగవల్లి దళార్పణ (తమలపాకుల అర్చన) కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమాల్లో పడిదల మాధవి - సురేందర్రావు దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు.కార్యక్రమం సందర్భంగా అర్చకులు కృష్ణ కాంత ఆచార్యులు మాట్లాడుతూ సుందరకాండ పారాయణ ప్రాముఖ్యతను వివరించారు, సుందరకాండ పఠనం వల్ల దుష్టశక్తులు, ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. జీవితంలో ఎదురయ్యే క్లిష్ట సమస్యల నుంచి గట్టెక్కడానికి ఈ పారాయణం ఎంతో దోహదపడుతుందని భక్తుల బలమైన విశ్వాసం. ఈ పారాయణాన్ని వీక్షించినా, విన్నా సకల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు.హోమం కేవలం మతపరమైన ప్రక్రియే కాకుండా, దాని వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని అర్చకులు తెలిపారు. పురాణ కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు ప్రకృతి సమతుల్యత కోసం, సకాలంలో వర్షాలు కురవాలని హోమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మాలధారణ చేసిన స్వాములు, చిన్నారులు, మహిళలు మరియు వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామివారి విగ్రహాన్ని రంగురంగుల పుష్పాలతో మనోహరంగా అలంకరించి, వేదమంత్రాల సాక్షిగా అర్చనలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా హనుమాన్ నామస్మరణతో మారుమోగింది.
Admin
Vastava Gamyam