Vastava Gamyam - తెలంగాణ / : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణాన్ని చేపట్టడంపై స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు సామాజిక సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. గురువారం నాడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంచిర్యాల జిల్లా కన్వీనర్ కోలుగురి విజయ్ కుమార్ ఈ విషయంపై అధికారులకు విన్నవించారు. పాఠశాల ఆవరణకు అతి సమీపంలో టవర్ నిర్మించడం వల్ల వెలువడే రేడియేషన్ విద్యార్థులపై, ముఖ్యంగా చిన్న పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టవర్ నిర్మాణం కోసం సుమారు 35 ఏళ్ల చరిత్ర గల వృక్షాలను ఇప్పటికే నరికివేయడం అత్యంత బాధాకరమని, అత్యంత కాలుష్య భరితమైన మందమర్రిలో ఇలాంటి చర్యలు ప్రజల ఆరోగ్యానికి గొడ్డలి పెట్టు అని పేర్కొన్నారు. నిత్యం వందలాది మంది వాకర్స్, క్రీడాకారులు వినియోగించుకునే ఈ మైదానంలో టవర్ నిర్మించడం సరికాదని, ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. ఈ సమస్యపై రాష్ట్ర మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ మరియు సింగరేణి ఏరియా జిఎం రాధాకృష్ణ వెంటనే స్పందించి నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరారు. జనావాసాలు లేని ప్రాంతానికి ఈ టవర్ను తరలించి, పాఠశాల విద్యార్థులను, పర్యావరణాన్ని కాపాడాలని రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక సంఘాల మిత్రులు మరియు తల్లిదండ్రులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
Admin
Vastava Gamyam