Vastava Gamyam - తెలంగాణ / హైదరాబాదు : శంకర్ పల్లి సమీపంలో జరిగిన ఘోర క్రేన్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మంగళవారం పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి ఆసుపత్రికి వెళ్లిన మంత్రి, బాధితులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.సోమవారం కురిసిన భారీ వర్షం, బలమైన గాలుల ధాటికి ఎన్సీసి సీ లిమిటెడ్ సంస్థకు చెందిన భారీ నిర్మాణ క్రేన్ ఒక్కసారిగా పక్కనే ఉన్న షెడ్పై కూలిపోయింది. వర్షం నుంచి రక్షణ పొందేందుకు ఆ సమయంలో షెడ్లో ఆశ్రయం పొందిన వలస కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ఐదుగురు వలస కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.క్షతగాత్రులు 12 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు ఎముకలు విరిగినట్లు వైద్యులు ధృవీకరించారు.ప్రమాదం జరిగిన తీరుపై మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, పూర్తి నివేదికను వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. "ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుంది. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాం. నిర్మాణ సంస్థల వద్ద భద్రతా ప్రమాణాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు."క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే ఉన్నత స్థాయి చికిత్సకు ఏర్పాట్లు చేయాలని ఆయన వైద్యులకు సూచించారు.
Admin
Vastava Gamyam