వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి ఏఎంసి (వ్యవసాయ మార్కెట్ కమిటీ) పరిధిలోని సింగరేణి ప్రాంతంలో కొన్నేళ్లుగా ఆక్రమణకు గురైన విలువైన సింగరేణి భూములను అధికారులు విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణదారుల నుంచి సంస్థ ఆస్తులను రక్షించేందుకు సింగరేణి సెక్యూరిటీ వింగ్ (ఎస్అండ్పీసీ) మరియు అటవీ శాఖ (ఫారెస్ట్) అధికారులు ఉమ్మడిగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.బేల్లెంపల్లి ఏరియా సింగరేణి పరిధిలోని సదరు భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లినట్లు నిర్దిష్ట సమాచారం అందడంతో సింగరేణి ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సింగరేణి రక్షణ విభాగం మరియు ఫారెస్ట్ అధికారులు సమన్వయంతో ఫీల్డ్లోకి దిగారు. ఆక్రమణలను పూర్తిగా తొలగించి, ఆ భూమిని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.ప్రభుత్వ మరియు సింగరేణి లీజు భూములను కబ్జాదారుల బారి నుండి రక్షించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న స్థలాల చుట్టూ రక్షణ చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్లో చొరవ చూపిన సింగరేణి సెక్యూరిటీ మరియు అటవీ అధికారులను సంస్థ ఉన్నతాధికారులు అభినందించారు. భవిష్యత్తులోనూ సింగరేణి భూములపై ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Reporter
వాస్తవ గమ్యం