వాస్తవ గమ్యం / తెలంగాణ / పెద్దపల్లి : గోదావరిఖని సింగరేణి పరిధిలోని రామగుండం -I, రామగుండం -II మరియు రామగుండం -III ఏరియాలకు చెందిన ఉద్యోగుల పిల్లలను గోదావరిఖని, ఎన్టీపీసీ ప్రాంతాల్లోని ప్రైవేట్ పాఠశాలలకు తరలించే స్కూల్ బస్సు సౌకర్యాన్ని నిలిపివేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు బ్రాంచ్ కార్యదర్శి గంధం సాంబశివరావు ఒక ప్రకటన విడుదల చేశారు. దశాబ్దాల నాటి సౌకర్యాన్ని నిలిపివేయడం అన్యాయం దశాబ్దాలుగా సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఈ రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుంటూ విద్యను అభ్యసిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. సెక్రెట్ హార్ట్ స్కూల్కు 50 ఏళ్లుగా, సేంట్ క్లేర్ స్కూల్కు 40 ఏళ్లుగా, సచ్ దేవ్ స్కూల్కు 30 ఏళ్లుగా బస్సులు నడుస్తున్నాయని వివరించారు. ప్రస్తుత బస్సుల కాంట్రాక్టు గడువు ముగియనుండటంతో, వాటి కొనసాగింపునకు ఆర్ జి -I ఏరియా నుండి పంపిన ప్రతిపాదనలను యాజమాన్యం తిరస్కరించడం కార్మికుల సంక్షేమానికి వ్యతిరేకమైన చర్య అని మండిపడ్డారు. అలాగే, 8వ కాలనీలోని సింగరేణి స్కూల్లో గత ఏడాది సీబీస్ఇ సిలబస్ ప్రవేశపెట్టిన యాజమాన్యం, విద్యార్థులకు కనీసం స్కూల్ బస్సు సౌకర్యం కల్పించలేకపోవడం విచారకరమన్నారు.ఒకవైపు సింగరేణి యాజమాన్యం సి ఎస్ ర్ మరియు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధుల సిఫారసులతో వివిధ పనుల కోసం కోట్లాది రూపాయలను కేటాయిస్తోంది. కానీ, సంస్థ అభివృద్ధికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్న కార్మికుల పిల్లల విద్య, రవాణా లాంటి ప్రాథమిక సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు వెనుకడుగు వేయడం అత్యంత దురదృష్టకరం.కార్మికుల చెమటతో సంపద సృష్టిస్తున్న సింగరేణి సంస్థ, వారి పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఈ చిన్న సంక్షేమ కార్యక్రమాన్ని భరించలేమనడం బాధాకరమన్నారు. యాజమాన్యం తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయం వల్ల వందలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని, ఇది పిల్లల విద్యాభ్యాసంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.సింగరేణి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ , మరియు డైరెక్టర్ (పా) ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. స్కూల్ బస్సుల కాంట్రాక్టులను వెంటనే పొడిగించి, ఉద్యోగుల పిల్లలకు ప్రస్తుతం ఉన్న రవాణా సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరింది. లేనిపక్షంలో కార్మికులు, విద్యార్థులు, తల్లిదండ్రులను ఏకం చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కే. రాజ రత్నం, బ్రాంచ్ ఉపాధ్యక్షులు అన్నారావు, సహాయ కార్యదర్శులు శాంసన్, రవి కుమార్, కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షులు బుర్ర తిరుపతి, ఆర్గనైసింగ్ సెక్రటరీలు మహేందర్, సంపత్, మరియు ముఖ్య నాయకులు కుమారస్వామి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం