వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి మండలంలో డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు మండల తహసిల్దార్ పనకంటి సతీష్ కుమార్ శర్మ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, అర్హత ప్రమాణాల ప్రకారమే లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం గృహ పథకం కింద సొంత ఇల్లు లేని అర్హులకే ఇళ్లను కేటాయించినట్లు తెలిపారు. కేటాయింపుల జాబితాలో ఎవరైనా అనర్హులు ఉన్నట్లు ఎవరికైనా సమాచారం ఉంటే సంబంధిత ఆధారాలతో మండల తహసిల్దార్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు లేదా దరఖాస్తు సమర్పించాలని సూచించారు.అందిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ నిర్వహించి, అనర్హులుగా తేలిన వారి పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూం ఇల్లు ఇప్పిస్తామని చెప్పి కొందరు ప్రజలను మోసం చేసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించిన తహసిల్దార్, అలాంటి వ్యక్తుల మాటలను నమ్మి ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇళ్ల కేటాయింపుకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా ఫిర్యాదులు ఉంటే నేరుగా మండల తహసిల్దార్ కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగానే కొనసాగుతాయని తహసిల్దార్ పేర్కొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం