వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి,జులై 2 : పంటలను అడవి జంతువుల నుంచి రక్షించేందుకు పొలాల చుట్టూ అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమని మందమర్రి పోలీసులు హెచ్చరించారు. ఇటీవల కొంతమంది రైతులు కోతులు, అడవి పందులు, నీలిగాళ్లు తదితర జంతువుల నివారణ కోసం నేరుగా విద్యుత్ లైన్ల నుంచి కరెంట్ తీసుకుని పొలాల చుట్టూ తీగలు ఏర్పాటు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ విధంగా అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం వల్ల అమాయక ప్రజలు, పశువుల కాపరులు,వ్యవసాయ కూలీలు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అడవి జంతువులను నివారించేందుకు విద్యుత్ లైన్ల నుంచి నేరుగా కరెంట్ కనెక్షన్లు ఇవ్వడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. అక్రమ విద్యుత్ తీగల కారణంగా ఎవరికైనా ప్రాణనష్టం సంభవిస్తే, సంబంధిత భూ యజమాని లేదా కరెంట్ కనెక్షన్ ఏర్పాటు చేసిన వ్యక్తిపై నేరపూరిత మానవహత్య కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని హెచ్చరించారు.పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ (ట్రాన్స్కో) అధికారులు సంయుక్తంగా పొలాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్రమ విద్యుత్ కనెక్షన్లు గుర్తిస్తే విద్యుత్ చట్టాల ప్రకారం భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధిస్తామని పేర్కొన్నారు. రైతులు పంటలను రక్షించేందుకు ప్రభుత్వం అనుమతించిన సోలార్ ఫెన్సింగ్ (తక్కువ వోల్టేజ్), నైలాన్ నెట్లు లేదా ఇతర సురక్షితమైన పద్ధతులను మాత్రమే వినియోగించాలని, నేరుగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేయరాదని సూచించారు.అలాగే, అక్రమ విద్యుత్ కనెక్షన్లపై సమాచారం ఉన్న వారు వెంటనే మందమర్రి పోలీస్ స్టేషన్ లేదా డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం