వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : శ్రీరాంపూర్: సింగరేణి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-న్యూ టెక్ భూగర్భ గనిలో మౌలిక సదుపాయాల కొరతపై కార్మికులు మంగళవారం బైఠాయించి ఆందోళన చేపట్టారు. గనిలో పనులు నిర్వహించేందుకు అవసరమైన పనిముట్లు, మెటీరియల్స్ అందుబాటులో లేకపోవడంతో రోజువారీ పనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భూగర్భ పనిస్థలాల్లో తగినంత గాలి ప్రసరణ లేకపోవడం, తాగునీటి సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు తెలిపారు. పనులు సజావుగా సాగేందుకు అవసరమైన సామగ్రిని యాజమాన్యం సమకూర్చడంలో నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. అనారోగ్యానికి గురై చికిత్స అవసరమైన సందర్భాల్లో కూడా ఆస్పత్రిలో బెడ్పై చేరితేనే 'సిక్ మాస్టర్' వర్తింపజేస్తున్నారని, దీంతో అనారోగ్యంతో ఉన్న కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కార్మికుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గనిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు. పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Reporter
వాస్తవ గమ్యం