వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణిలో పనిచేస్తున్న ఒక మహిళా కార్మికురాలిని అవమానపరుస్తూ, అసభ్యకర పదజాలంతో పాటలు రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని ప్రగతిశీల మహిళా సంఘం,తీవ్రంగా ఖండించింది.ఈ మేరకు ప్రగతి శిల మహిళా సంఘo రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె. జ్యోతి ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.సింగరేణి వ్యాప్తంగా వేలాది మంది మహిళా కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారని, పని ప్రదేశాల్లో ఇప్పటికే వారు అనేక వివక్షలు,అవమానాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మహిళా కార్మికురాలి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా అసభ్యకర పాటలు కట్టడం, వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సింది పోయి, ఇలాంటి చౌకబారు ప్రచారాలతో వారి మనోభావాలను దెబ్బతీయడం సరికాదు. సదరు మహిళా కార్మికురాలిని కించపరిచిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.పని ప్రదేశాల్లో మహిళలకు తగిన రక్షణ కల్పించాలని, గౌరవప్రదమైన వాతావరణం ఉండేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలను అవమానించేలా సాగుతున్న ఈ ప్రచారాన్ని తక్షణమే నిలిపివేయాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా జ్యోతి స్పష్టం చేశారు.
Admin
వాస్తవ గమ్యం