వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జై భారత్ వ్యవస్థాపకులు, హిందుస్థానీ గోరక్షా సమితి కన్వీనర్ రమణమూర్తిపై హైదరాబాద్లో టీవీ చర్చ సందర్భంగా జరిగిన దాడి ఘటనను ఖండిస్తూ శనివారం మంచిర్యాల అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ ప్రజాసంఘాల నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా నిరసనకారులు రమణమూర్తికి మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, దాడికి పాల్పడిన నిందితుడు కశ్యపరెడ్డిని వెంటనే అరెస్టు చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వక్తలు మాట్లాడుతూ, అయోధ్య అంశంపై టీవీ చర్చలో రమణమూర్తి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి దురుద్దేశంతోనే దాడి జరిగిందని ఆరోపించారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేస్తూ, తిరుపతిలో అన్నమయ్య విగ్రహ ఏర్పాటులో ఆయన పాత్రను ప్రస్తావించారు.తెలంగాణలో సర్వమత సామరస్యాన్ని దెబ్బతీసే ఘటనలకు తావు ఇవ్వకూడదని, దాడి జరిగినప్పటి నుంచి ప్రభుత్వం ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి డూర్కె మోహన్, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేశం, బీసీ ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల మల్లయ్య, బీసీ సంఘాల జాతీయ వేదిక నాయకుడు గుమ్ముల శ్రీనివాస్, బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి కన్వీనర్ మోతె రామదాసు, జై భారత్ కమిటీ జిల్లా నాయకులు మనస్పూరి రమేష్, మేతరి లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారులు కైలాసం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం