Vastava Gamyam - తెలంగాణ / హైద్రాబాద్ : కొత్తగూడెం: కృష్ణా, గోదావరి నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.కొత్తగూడెం క్లబ్ హాలులో సోమవారం బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి రూపొందించిన ‘ఈ-క్లాస్ యాప్’ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్నప్పటికీ.సీఎం రేవంత్ రెడ్డి ఉదాసీనత వల్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. దీనిపై కేసీఆర్ మార్గదర్శనంలో పార్లమెంట్లో ఎంపీలు దామోదర్ రావు, పార్థసారథి రెడ్డిలతో కలిసి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తామన్నారు. రాష్ట్రానికి నిధులు తేవడంలో, అన్యాయాలపై ప్రశ్నించడంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 16 మంది లోక్సభ సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. 100 ఏళ్ల చరిత్ర గల కొత్తగూడెం రైల్వే స్టేషన్ను డివిజన్గా చేయాలని, బస్తర్, మల్కాన్గిరి వరకు విస్తరించాలని కేంద్రానికి నివేదించామన్నారు. ఖమ్మం-కొత్తగూడెం-భద్రాచలం రోడ్డును ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దుల వరకు 4 లేన్లుగా మార్చాలని పార్లమెంట్లో ప్రస్తావించినట్లు తెలిపారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు త్వరలోనే ప్రారంభమవుతుందని. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలను ఎండగట్టేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా త్వరలో పాదయాత్ర చేయనున్నారని ప్రకటించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని, భవిష్యత్తులో అసెంబ్లీ సీట్లు 119 నుండి 179కి పెరిగినా తెలంగాణలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాకేష్ రెడ్డి రూపొందించిన ఈ-క్లాస్ యాప్ను యువత సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam