వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.గురువారం హాజీపూర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భోజనశాల, అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం, శుద్ధమైన తాగునీరు అందించాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు.అనంతరం హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించి, ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేయాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు జాబితాలో నమోదు అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని, బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు, వాలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీల పనితీరు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా, జలసిరి పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.తదనంతరం లక్షెట్టిపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అత్యవసర విభాగం, వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. వర్షాకాలంలో అంటువ్యాధుల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.మున్సిపల్ కమిషనర్ విజయ్కుమార్తో కలిసి అమృత్–2.0 పథకం పనులను పరిశీలించి, వాటిని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో వంటశాలను తనిఖీ చేసి, పరిశుభ్రత పాటిస్తూ తాజా నిత్యావసర సరుకులతో పౌష్టికాహారం సిద్ధం చేసి విద్యార్థులకు మెనూ ప్రకారం అందించాలని వంట సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం