వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ప్రభుత్వం చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు అధికారులను ఆదేశించారు.బుధవారం భీమారం మండలం మద్దికల్ గ్రామంలో జరుగుతున్న భూముల రీ-సర్వే పనులను మండల తహసీల్దార్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మద్దికల్ గ్రామంలో మొత్తం 853 సర్వే నంబర్లలో 4,810 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. ముగ్గురు లైసెన్స్డ్ సర్వేయర్లు, ఒక సర్వేయర్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, రైతుల సమక్షంలో సర్వే పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.రీ-సర్వే పనులకు రైతులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని పేర్కొన్న ఆయన, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యంత పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని సూచించారు. దీంతో భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం తగ్గడంతో పాటు, స్పష్టమైన వివరాలతో నక్షాలు సిద్ధమవుతాయని తెలిపారు.అనంతరం ఆరెపల్లి గ్రామం, భీమారం మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.తదుపరి అంకుశాపూర్ గ్రామంలోని సమతా అగ్రో ఇండస్ట్రీస్ను పరిశీలించిన అదనపు కలెక్టర్, మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేసి ప్రభుత్వానికి అందించాల్సిన.సీఎంఆర్ (కస్టమ్ మిల్ల్డ్ రైస్)ను నిర్ణీత గడువులోగా సరఫరా చేయాలని రైస్ మిల్లు నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం