వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : సమాజంలో జరిగే ప్రతి సంఘటనను ప్రజలకు చేరవేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థకు నాలుగో స్థంభంగా నిలుస్తున్న జర్నలిస్టుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే-ఐజేయు) జిల్లా అధ్యక్షుడు, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు అబ్దుల్ రహమాన్ స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ నిరంతరం పనిచేస్తోందని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మీడియా అక్రిడిటేషన్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్య భద్రత, ఇతర రాయితీలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పలువురు పాత్రికేయులకు మీడియా అక్రిడిటేషన్ కార్డులను అందజేశారు. వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనదని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర అమూల్యమని పేర్కొన్నారు. అలాంటి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న అనేక మంది జర్నలిస్టులు ఇంకా అక్రిడిటేషన్ కార్డులకు దూరంగా ఉన్నారని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అక్రిడిటేషన్ కార్డులు అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని అబ్దుల్ రహమాన్ తెలిపారు. అక్రిడిటేషన్ కార్డు కేవలం గుర్తింపు పత్రం మాత్రమే కాకుండా జర్నలిస్టులకు లభించే అనేక ప్రభుత్వ ప్రయోజనాలకు మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, సంక్షేమ నిధులు, విద్యా సదుపాయాలు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించేలా యూనియన్ తరఫున నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న విలేకరులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ తమ విధులను నిబద్ధతతో నిర్వహిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం మీడియా రంగం ఎన్నో మార్పులకు లోనవుతోందని, డిజిటల్ మీడియా విస్తరణతో పాటు జర్నలిస్టులపై పని భారం పెరిగిందని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో జర్నలిస్టుల హక్కులు, భద్రత, వృత్తి గౌరవం కాపాడేందుకు సంఘటిత శక్తి అవసరమని అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొనే బెదిరింపులు, ఒత్తిళ్లు, వివక్ష వంటి అంశాలపై యూనియన్ గట్టిగా స్పందిస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులకు రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ, జర్నలిస్టులపై దాడులు లేదా వేధింపులు జరిగిన సందర్భాల్లో సంఘం తరఫున న్యాయపరంగా కూడా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పాత్రికేయుల వృత్తి స్వేచ్ఛను కాపాడేందుకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండాలని, పరస్పర సహకారంతో ముందుకు సాగాలని అబ్దుల్ రహమాన్ పిలుపునిచ్చారు. వ్యక్తిగత విభేదాలను పక్కనబెట్టి జర్నలిస్టుల ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని సూచించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం చేపట్టే ప్రతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అక్రిడిటేషన్ కార్డులు అందుకున్న పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. తమ సమస్యలపై స్పందిస్తూ అండగా నిలుస్తున్న టీయూడబ్ల్యూజే (ఐజేయు) నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం సంఘం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు అబ్దుల్ రహమాన్, ప్రకాష్ గౌడ్, పాత్రికేయుడు సురేష్,సతీష్ గౌడ్ పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం