వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి,సింగరేణి ఏరియాలో భూములను నమ్ముకుని యాజమాన్యానికి అప్పగించిన భూ నిర్వాసితుల పట్ల అధికారులు మొండి వైఖరి అవలంబిస్తున్నారు.టెండర్ షెడ్యూల్లో ఉన్న నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సింది పోయి,వాటిని తుంగలో తొక్కి తమకు అనుకూలమైన వారికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిబంధనలను తమకు అనుగుణంగా మార్చుకుంటూ అటు నిర్వాసితులను, తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలో హైర్ వెహికల్స్(అద్దె వాహనాల)కోసం యాజమాన్యం భూ నిర్వాసితుల నుండి టెండర్లను ఆహ్వానించింది. ఆ ప్రక్రియలో భాగంగా, ఒక వాహనంపై ఓనర్తో పాటు మరో ఇద్దరికి టెండర్ తీయడం జరిగింది. నిబంధనల ప్రకారం.మొదటి వ్యక్తి వెహికల్ ఒప్పందాన్ని పొందగా, రెండో మరియు మూడో లబ్ధిదారులు వెయిటింగ్ లిస్ట్'లో కొనసాగాల్సి ఉంటుంది.అంటే, భవిష్యత్తులో అదే స్థానంలో వాహనం అవసరమైతే, మళ్లీ టెండర్ పిలవకుండానే వరుస క్రమంలో ఉన్న రెండో వ్యక్తికి అవకాశం ఇవ్వాలి.కానీ, ప్రస్తుతం అధికారులు ఆ పాత నిబంధనలను పక్కన పెట్టేసి, వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వారికి కాకుండా మళ్లీ కొత్తగా టెండర్లు పిలవడం పలు అనుమానాలకు తావిస్తోంది.అప్పటి నిబంధనలు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి ఇది అధికారుల ఉత్సాహమా లేక కావాలని ఎవరికైనా లబ్ధి చేకూర్చేందుకు చేస్తున్న కుట్రలా అని లబ్ధిదారులు నేరుగా అధికారులనే నిలదీస్తున్నారు.ఇప్పటికే మందమర్రిలో సెక్యూరిటీ టెండర్ల విషయంలో జరిగిన గందరగోళం వల్ల సుమారు 200 మందికి పైగా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇప్పుడు అదే పంథాలో భూ నిర్వాసితుల వాహన టెండర్ల నిబంధనలు మార్చడం పట్ల స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. యాజమాన్యం నమ్మి భూమి ఇచ్చినందుకు తమకు ఇదా ప్రతిఫలం అని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.టెండర్ షెడ్యూల్లో ఉన్న నిబంధనలను యథావిధిగా అమలు చేయాలి. వెయిటింగ్ లిస్ట్లో ఉన్న భూ నిర్వాసితులకు వెంటనే న్యాయం చేసి, వారికి అవకాశం కల్పించాలి. పక్షపాత వైఖరి వీడి, పారదర్శకంగా టెండర్ ప్రక్రియ నిర్వహించాలి. అధికారులు ఇప్పటికైనా స్పందించి, భూ నిర్వాసితుల ఆవేదనను గుర్తించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని బాధితులు హెచ్చరిస్తున్నారు.
Admin
వాస్తవ గమ్యం