వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : చెన్నూరు పట్టణ బీజేపీ ప్రధాన కార్యదర్శి కాయిత వెంకటేష్ ఆధ్వర్యంలో, చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్ నుండి రావిచెట్టు వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు, నూతన రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ తదితర అభివృద్ధి పనులను మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పరిశీలించాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చెన్నూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.రోడ్డు విస్తరణ పేరుతో అనేక మంది చిన్న వ్యాపారుల షాపులను తొలగించినప్పటికీ, వారికి ఇప్పటివరకు ఎలాంటి నష్టపరిహారం అందించలేదని తెలిపారు. ఫలితంగా అనేక కుటుంబాలు తమ జీవనోపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. అదేవిధంగా రోడ్డు, డ్రైనేజీ పనులు కూడా ఆశించిన వేగంతో ముందుకు సాగకపోవడం వల్ల ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, చెన్నూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ అభివృద్ధిపై తగిన దృష్టి పెట్టడం లేదని విమర్శించారు.ప్రభుత్వం వెంటనే రోడ్డు విస్తరణ వల్ల నష్టపోయిన బాధితులకు తగిన నష్టపరిహారం అందించి, పెండింగ్లో ఉన్న రోడ్లు, డ్రైనేజీ పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చెన్నూరు పట్టణ అభివృద్ధిపై ఇకనైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం