Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : చెన్నూరు మండల పరిధిలోని కిష్టంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, చెన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ కంటెస్టెడ్ అభ్యర్థి దుర్గం అశోక్ సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంపై ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏ ఓ) యామినితో ఫోన్ ద్వారా మాట్లాడి, కొనుగోళ్లలో అలసత్వాన్ని వీడి త్వరితగతిన ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ... కొనుగోలు కేంద్రాలకు లారీలు రావాలంటే 5000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, అలాగే అన్ లోడింగ్ కోసం బస్తాకు రూ. 15 నుండి రూ. 20 (క్వింటాలుకు సుమారు రూ. 50) వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, తేమ పేరుతో బస్తాకు 2 నుండి 5 కిలోల వరకు తరుగు (కటింగ్) విధిస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చెన్నూరు మార్కెట్ యార్డ్ గోదాముకు వెళ్లిన ఆయన.ఎలాంటి తరుగు లేకుండా, తక్షణమే అన్ లోడింగ్ ప్రక్రియను పూర్తి చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని పై అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ చెన్నూరు మండల అధ్యక్షులు బుర్ర రాజశేఖర్ గౌడ్, 18వ వార్డు కౌన్సిలర్ ఏతం శివకృష్ణ, మాజీ పట్టణ అధ్యక్షులు జాడి తిరుపతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఆలం బాపు, పట్టణ ప్రధాన కార్యదర్శి కాయిత వెంకటేష్, సీనియర్ నాయకులు యువరాజ్, రాజేశ్ చింతల తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam