వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ బుధవారం వివిధ డివిజన్లలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఉప్పొంగుతున్న నాళాలు, లోతట్టు ప్రాంతాలు, నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.39వ డివిజన్ బృందావన్ కాలనీలోని ఫ్లైఓవర్ సమీపంలో వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకంగా మారిన చెత్తాచెదారం, పైపులను జేసీబీ సాయంతో తొలగించి నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించారు. అధిక వర్షపాతం దృష్ట్యా అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని మేయర్ ఆదేశించారు.నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. వర్షాల ప్రభావంతో అత్యవసర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.అలాగే, అవసరం లేని సమయంలో ఉప్పొంగుతున్న నాళాలు, వాగులు, నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని మేయర్ దర్ని మధుకర్ విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం