వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు జిల్లా, మండల కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. శనివారం కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఓబీసీ విభాగం జిల్లా పరిశీలకుడు ముత్తినేని రవీందర్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఎమ్మెల్సీ దండే విఠల్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముత్తినేని రవీందర్ మాట్లాడుతూ పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న వారికి కమిటీల్లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. ఓబీసీ విభాగాన్ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా కమిటీల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఆత్రం సుగుణక్క మాట్లాడుతూ ఓబీసీల సమస్యలు, హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే నాయకులు, కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లా, మండల స్థాయిలో ఓబీసీ విభాగం పదవులకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. పార్టీ మార్గదర్శకాలకు అనుగుణంగా కమిటీల నిర్మాణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఓబీసీ విభాగం ఆశావహులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం