వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్వోలు తో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటైజేషన్ ప్రక్రియను బీఎల్వో సూపర్వైజర్లు, ఏఈఆర్వోలు, ఈఆర్వోలు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడంతో పాటు, అనర్హుల పేర్ల తొలగింపు, ఓటరు వివరాల సవరణ వంటి ప్రక్రియలను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో ప్రతి కేంద్రంలో 1,200 మందికి మించకుండా ఓటర్ల సంఖ్య ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి, వాటి వివరాలను డాక్యుమెంటేషన్ చేయాలని, అలాగే ఏఎస్డీ జాబితా సిద్ధం చేసిన తర్వాత సంబంధిత బూత్ స్థాయి ఏజెంట్ సంతకం తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 81 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయ్యిందని, నిర్ణీత గడువులోగా 100 శాతం పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు, వాలంటీర్లు, యువత సహకారంతో ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.సమీక్ష సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు, ప్రత్యేక ఉపపాలన అధికారి చంద్రకళ, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలయత్ అలీ, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం