వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : కోటపల్లి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రజల కోసం వెంటనే త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ రాఘవేంద్రరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా దంచి కొడుతున్నప్పటికీ, నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే తహశీల్దార్ కార్యాలయంలో కనీసం త్రాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడం తహశీల్దార్ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మండిపడ్డారు.వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చాలని గత ఏడాది కూడా వినతిపత్రం ఇచ్చాం. అనేకసార్లు గుర్తు చేసినప్పటికీ అధికారులు కాలయాపన చేస్తూ దాటవేస్తున్నారు.కార్యాలయంలో నీటి సదుపాయం లేకపోవడంతో దూరాభారం నుండి వచ్చే రైతులు, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాహం తీర్చుకోవడానికి బయట కిరాణా షాపుల్లో డబ్బులు పెట్టి నీళ్లు కొనాల్సి వస్తోందని, ఒకవేళ నీళ్ల కోసం బయటకు వెళ్తే లోపల అధికారి ఎప్పుడు పిలుస్తారో తెలియక ప్రజలు దాహాన్ని భరిస్తూ అక్కడే వేచి చూడాల్సి వస్తోందని అన్నారు. నీరు సరిగ్గా అందక పలువురు డిహైడ్రేషన్కు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా తహశీల్దార్ రాఘవేంద్రరావు స్పందించి, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే త్రాగునీటి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు జిమిడే రాజమల్లు, జిమిడే లింగయ్య, కన్న సత్యన్న, పోగుల గంగన్న, దామోదర్, జిమెడి అంజన్న, పాటి మీద సంపత్, కొండ సమ్మయ్య, రావుల జీవన్, ముంజం పోషమల్లు, కొండగుర్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం