వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రాజకీయాలకు అతీతంగా రైతులు, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. పంటల సాగుపై తీవ్ర అనిశ్చితి నెలకొని రైతులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణహిత నది ద్వారా లక్షల క్యూసెక్కుల నీరు తెలంగాణ మీదుగా ప్రవహించి వినియోగం లేకుండా దిగువకు వెళ్లిపోతోందని తెలిపారు. ఈ నీటిని సద్వినియోగం చేసేందుకు కన్నేపల్లి పంప్హౌస్ మోటార్లను వెంటనే ప్రారంభించి ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు ఇతర రిజర్వాయర్లలో నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.కన్నేపల్లి పంప్హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి ప్రాజెక్టులను నింపడం వల్ల ఎలాంటి సాంకేతిక నష్టం జరగదని రిటైర్డ్ ఇంజనీర్లు ఇప్పటికే సూచించారని రైతులు తెలిపారు. అవసరమైతే తాము స్వయంగా అక్కడే ఉండి పంపింగ్ ప్రక్రియను పర్యవేక్షించడానికి సిద్ధంగా ఉన్నామని వారు వెల్లడించిన విషయాన్ని గుర్తు చేశారు.ప్రాజెక్టులను నింపడం వల్ల రాష్ట్రంలోని రైతులు,ప్రజలకు మేలు జరుగుతుందని, ఏ ప్రాజెక్టుకు లేదా ఎవరికీ మంచి పేరు వస్తుందన్నది ముఖ్యమేమీ కాదని, ప్రజా ప్రయోజనాలే ప్రభుత్వ నిర్ణయాలకు ప్రాధాన్యం కావాలని రైతులు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల బాధ్యత రైతుల ప్రయోజనాలను కాపాడటమేనని, అందువల్ల ఆలస్యం చేయకుండా కన్నేపల్లి పంప్హౌస్ మోటార్లను ప్రారంభించి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని తరలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు విజ్ఞప్తి చేశారు.
Reporter
వాస్తవ గమ్యం