Vastava Gamyam - తెలంగాణ / : ప్రభుత్వ పాఠశాలలు మరియు సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యా బోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం నస్పూర్ మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, పరిసరాలు, మరియు మూత్రశాలలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టికను, ఇతర రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులను కల్పిస్తూ, విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో, సృజనాత్మకంగా బోధించాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని, మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారాన్ని నిర్ణీత సమయానికి అందించాలని స్పష్టం చేశారు.పాఠశాల భవనాల్లో ఏవైనా మరమ్మతులు ఉంటే వెంటనే గుర్తించి, యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పిల్లలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, విద్యాశాఖ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam