Vastava Gamyam - తెలంగాణ / నిర్మల్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ చేయడమే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ ప్రధాన ఉద్దేశ్యమని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని జేకే ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక ప్రణాళికతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. ఖానాపూర్ నియోజకవర్గానికి 6,155 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, సుమారు 53 వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతోందని వివరించారు. రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలతో పాటు, ఇటీవల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.జిల్లాలో పారిశుధ్యం, విద్య, వైద్య రంగాల్లో పురోగతి సాధించామన్నారు. పదవ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.త్వరలోనే ఇందిరమ్మ జీవిత బీమా,పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ వంటి నూతన పథకాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్నకళ్యాణి, సిపిఓ జీవరత్నం, మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam