వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలో కురిసిన అకాల వర్షo నలుగురు రైతుల ప్రాణాలను బలితీసుకుంది. అర్ధరాత్రి ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల బీభత్సానికి గోడ కూలి నలుగురు రైతులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అసలేం జరిగింది?రుతుపవనాల రాకకంటే ముందే అకస్మాత్తుగా విరుచుకుపడ్డ వర్షం నుండి తమ కష్టాన్ని (పంటను) కాపాడుకునేందుకు రైతులు కల్లాల వద్దకు వెళ్లారు. భారీ ఈదురు గాలులు వీస్తుండటంతో రక్షణ కోసం సమీపంలోని ఒక గోడ పక్కన నిలబడ్డారు. అయితే, గాలి వేగానికి ఆ పాత గోడ ఒక్కసారిగా కూలిపోవడంతో, శిథిలాల కింద చిక్కుకొని నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారిని ఓదార్చి, పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అన్నదాతలు కళ్ళముందే విగతజీవులుగా పడి ఉండటం చూసి నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ లక్సెట్టిపేట పట్టణంలోని ఉత్కూరు చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.మృతి చెందిన ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం వెంటనే 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతులకు సరైన రక్షణ కరువైందని, బాధ్యులైన ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. అకాల వర్షాలతో నష్టపోయిన మిగతా రైతులకు కూడా తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.రాస్తారోకో కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు.
Admin
వాస్తవ గమ్యం