వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. శనివారం రెబ్బెన మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ జేఈసీ పిలుపు మేరకు ఈ నెల 24 నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని ఆటో డ్రైవర్లను కోరారు. ఆటోలకు ఆర్టీఏ కార్యాలయాల్లో రేడియం స్టిక్కర్ల మినహాయింపు ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచాలని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఓలా, ఊబర్, రాపిడో వంటి అక్రమంగా నడుస్తున్న ద్విచక్ర వాహన సేవలను నిలిపివేసి, వాటి స్థానంలో ప్రభుత్వం ప్రత్యేక యాప్ను తీసుకురావాలని కోరారు. గతంలో ఉన్న ప్రమాద బీమాను పునరుద్ధరించాలని, ప్రభుత్వం ప్రకటించిన రూ.12 వేల ఆర్థిక సాయం వెంటనే అందించాలని, ఆటోలకు ఈ-చలాన్ల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సారథి వాహన్ పోర్టల్లో ఆటో డ్రైవింగ్ లైసెన్స్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో రెబ్బెన మండల గౌరవ అధ్యక్షుడు గోడిసెల వెంకటేశ్వర్ గౌడ్, ఉపాధ్యక్షుడు మోడెం రాజగౌడ్, ఆటో డ్రైవర్లు ఆనంద్, ప్రసాద్, నరేష్, వెంకటేష్, అజయ్, లక్ష్మణ్, బాబాఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం