వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం నస్పూర్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సీఐ రవీందర్తో కలిసి సందర్శించిన ఆయన, సీసీ కెమెరాల ఏర్పాటు, భోజనశాల, వంటశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.బాలికల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇంటర్మీడియట్ బీపీసీ విద్యార్థులతో మాట్లాడి బోధన నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు.అనంతరం నస్పూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను వేగవంతం చేయాలని, అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూభారతి, సాదా బైనమా, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై కూడా సమీక్ష నిర్వహించారు.మందమర్రి, బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించిన కలెక్టర్, ఓటరు జాబితా సవరణ, భూభారతి, సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారంపై అధికారులకు పలు సూచనలు చేశారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్తో కలిసి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.తదనంతరం కాసిపేట, తాండూర్ ప్రాంతాల్లో సింగరేణి నూతన ఓపెన్కాస్ట్ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదిత స్థలాలను సంబంధిత అధికారులు, సింగరేణి జనరల్ మేనేజర్లతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం