వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని చార్వక ఈఎన్టీ ట్రస్ట్లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ. కొల్హాపూర్ సంస్థానంలో మెజారిటీ ప్రజలైన బహుజనులకు రిజర్వేషన్లు కల్పించి, ఆ సంస్థానాన్ని సామాజిక సంస్థానంగా మార్చిన ఘనత సాహు మహారాజ్దేనని కొనియాడారు. బుద్ధుడు,కబీర్, మహాత్మా జ్యోతిబాఫులే ఆశయాలను ఆయన ఆచరణలో చూపెట్టారని పేర్కొన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత విద్యకు సాహు మహారాజ్ ఎంతో సహకారం అందించారని,ఆయన నడిపిన మూక్ నాయక్ పత్రికకు అండగా నిలిచారని గుర్తుచేశారు.1920 మార్చి 22న జరిగిన దక్కన్ అస్పృశ్య సమాజ సమ్మేళన సభలోనే.భవిష్యత్తు అంబేద్కర్ ఆశయాలతోనే ముందుకు సాగుతుందని సాహు మహారాజ్ ప్రకటించారని వివరించారు. తన సంస్థానంలో బహుజనులకు ఉద్యోగాలిస్తూ, భూములకు పట్టాలు ఇచ్చారని.గంగారాం కాంబ్లే అనే వ్యక్తి హోటల్ పెట్టుకోవడానికి ఆర్థిక సాయం అందించడమే కాకుండా, స్వయంగా వెళ్లి అక్కడ టీ తాగిన గొప్ప సంస్కర్త ఆయనని కొనియాడారు. సమాజంలో వితంతు వివాహ చట్టాన్ని తీసుకువచ్చి, కులాంతర వివాహాలను ప్రోత్సహించారని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఈ వేడుకల్లో బీఎస్పీ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడు బండారి రాజ్ కుమార్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల శంకర్, బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గోమాస బ్రహ్మానందం, జిల్లా నాయకులు పేట్టెం చంద్రశేఖర్, దుర్గం గంగారాం, కుమ్మరి కృష్ణ చైతన్య, ముల్కల్ల జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం