వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.గురువారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.జిల్లాలో సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ఇప్పటికే సుమారు 90 శాతం పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను నిర్ణీత గడువుకంటే ముందే పూర్తి చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో అనామోలీస్ ఎక్కువగా ఉన్నాయని, డిజిటలైజేషన్ పూర్తైన అనంతరం సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. నోటీసులు అందుకున్న ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నోటీసులో సూచించిన ధ్రువపత్రాలను సమర్పించడం ద్వారా ఓటు హక్కును కొనసాగించుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. డబుల్, మరణించిన, ఇతర ప్రాంతాలకు మారిన వారి ఓట్లను ఎన్నికల నిబంధనల ప్రకారం తొలగిస్తామని తెలిపారు. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్లను గుర్తించి, బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా బూత్ స్థాయి అధికారులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డిజిటలైజేషన్ పూర్తైన అనంతరం పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కూడా చేపడతామని వెల్లడించారు.సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి మోతిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, మంచిర్యాల రాజస్వ మండలాధికారి శ్రీనివాసరావు, ఎన్నికల విభాగం అధికారులు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం