వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పార్కింగ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రి ఆవరణలో ఎక్కడ పడితే అక్కడ ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను పార్క్ చేయడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆసుపత్రి సిబ్బంది పర్యవేక్షణ లోపం, పార్కింగ్ నియంత్రణ లేకపోవడంతో పరిస్థితి రోజురోజుకూ మరింత దిగజారుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు వచ్చే 108 అంబులెన్సులు సైతం ఆసుపత్రి గేటు నుంచి ఎమర్జెన్సీ విభాగం వరకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాల రద్దీ కారణంగా అంబులెన్సులు ఆలస్యంగా చేరుకోవడం వల్ల సీరియస్ పేషెంట్లను సకాలంలో చికిత్సకు తరలించే అవకాశాలు దెబ్బతింటున్నాయని పేర్కొంటున్నారు. కొన్నిసార్లు రోగులను అంబులెన్స్ నుంచి స్ట్రెచర్లపై దూరం వరకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అంటున్నారు.ఆసుపత్రి వంటి అత్యంత కీలకమైన ప్రజా సేవా కేంద్రంలో పార్కింగ్ నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు సూచిస్తున్నారు. పార్కింగ్కు ప్రత్యేక స్థలాలను గుర్తించి, ట్రాఫిక్ నియంత్రణ సిబ్బందిని నియమించడం, అంబులెన్సులకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయడం, నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నిలిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రాణాలకు సంబంధించిన అత్యవసర సేవలు నిరాటంకంగా కొనసాగాలంటే ఆసుపత్రిలో పార్కింగ్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని రోగులు, వారి బంధువులు, స్థానికులు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.
Reporter
వాస్తవ గమ్యం