వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : 30: మంచిర్యాల మున్సిపాలిటీలో గత 12 ఏళ్లుగా జరిగిన నిధుల వినియోగంపై సమగ్ర విచారణ నిర్వహించాలని మేయర్ ధరణి మధుకర్ డిమాండ్ చేశారు. ఈ విచారణలో ఎవరిపై ఆరోపణలు నిజమని తేలినా, వారు ఎంతటి వారైనా చట్టపరంగా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, సోమవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎజెండా పూర్తిగా చదవకముందే బీజేపీ కార్పొరేటర్లు వాకౌట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు సూచించాల్సిన ప్రతిపక్షం, సమావేశాన్ని బహిష్కరించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. మున్సిపల్ నిధుల వినియోగంపై ఎలాంటి సందేహాలు ఉన్నా ప్రభుత్వం లేదా సంబంధిత సంస్థలతో విచారణ జరిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నిజాలు ప్రజల ముందుకు రావాలని మేయర్ పేర్కొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం