Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : చెన్నూరు మున్సిపల్ పట్టణంలో జరుగుతున్న శరవేగంగా అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పట్టణంలో సిమెంటు రోడ్లు, సోలార్ హైమాస్ లైట్ల ఏర్పాటుతో పాటు 100 పడకల ఆసుపత్రి త్వరలో ప్రారంభం కాబోతుందని వారు తెలిపారు.అంబేద్కర్ చౌక్ నుండి కోటపల్లి బస్ స్టాప్ వరకు 60 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా సహకరిస్తుంటే, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచనతో కొందరు నేతలు వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.గతంలో నోటీసులు ఇవ్వకుండానే క్యాంప్ ఆఫీస్ ముందు చిన్న వ్యాపారులను తొలగించిన చరిత్ర బాల్క సుమన్దని, 2019లో రోడ్డు వెడల్పు చేస్తానని చెప్పి వ్యాపారుల ప్రలోభాలకు లొంగి ఆ పనులను అప్పట్లో ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు.మహంకాళి వాడలో రైతుల ఇళ్లను కూలగొట్టినప్పుడు లేని 'నోటీసుల' నియమం ఇప్పుడే గుర్తొచ్చిందా అని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూలా రాజిరెడ్డిని నిలదీశారు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో వ్యాపారస్తులతో మూడు సార్లు చర్చించి, అందరికీ నోటీసులు ఇచ్చాకే రోడ్డు విస్తరణ చేపట్టామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నాయకపు వినయ్ కుమార్, కౌన్సిలర్లు అంబటి శంకర్, పెండ్యాల సాగర్, అజ్జు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam