వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ నిరంతరం పోరాడుతోందని టిజెఎ జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో గురువారం తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టిజెఎ) 12వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ ఆదేశాల మేరకు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ నేతృత్వంలో ఈ వేడుకలను వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జర్నలిస్టులు వృద్ధులకు అన్నదానం చేసి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అనంతరం అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో జిల్లాలోని జర్నలిస్టు నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.రాష్ట్రంలోని జర్నలిస్టులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి వారి ఐక్యతను చాటడంలో టిజెఎ కీలక పాత్ర పోషిస్తోందని నాయకులు పేర్కొన్నారు. సంస్థను రాష్ట్రవ్యాప్తంగా అగ్రగామిగా, బలమైన శక్తిగా తీర్చిదిద్దడంలో వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ అందిస్తున్న సేవలు, క్రమశిక్షణ అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులోనూ జర్నలిస్టుల సంక్షేమానికి, వృత్తిపరమైన రక్షణకు టిజెఎ అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో టిజెఎ జిల్లా నాయకులు సారంగరావు,డేగ ఆంజనేయులు,గట్టయ్య, గంగులు,అమర్నాథ్ రెడ్డి,గౌతం,పురుషోత్తం, ప్రేమ్ జీవన్,సతీష్,వినీత్, సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం