వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ శుక్రవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మితో కలిసి మంచిర్యాల జిల్లా కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన న్యాయస్థానం తదుపరి విచారణను సెప్టెంబర్ 25కు వాయిదా వేసింది.అనంతరం మీడియాతో మాట్లాడిన బాల్క సుమన్, క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు మెజారిటీ ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకునేందుకు అక్రమ మార్గాలను అనుసరించిందని ఆరోపించారు.ప్రజల మద్దతుతో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు కోట్ల రూపాయలు, బ్లాంక్ చెక్కులు ఆఫర్ చేసినప్పటికీ వారు లొంగలేదని, అందుకే తమపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని పేర్కొన్నారు.ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నందుకే రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారని ఆరోపించిన ఆయన, గతంలో సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం మాట్లాడినందుకు 20 రోజుల పాటు చంచల్గూడ జైలులో ఉంచారని గుర్తు చేశారు.సోషల్ మీడియాలో పోస్టులు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపైకూడా కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని, ప్రతిపక్ష నేతలకు ఒక చట్టం, అధికార పార్టీ నేతలకు మరో చట్టం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేసే వరకు బీఆర్ఎస్ తరఫున గట్టిగా నిలబడతాం" అని బాల్క సుమన్ స్పష్టం చేశారు.
Reporter
వాస్తవ గమ్యం