Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : గ్రామంలో సరఫరా అవుతున్న హై ఓల్టేజ్ విద్యుత్ సమస్యను తక్షణమే పరిష్కరించి, ప్రజల ప్రాణాలను కాపాడాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం డిమాండ్ చేసింది. నెల రోజులుగా హై ఓల్టేజ్ కారణంగా షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం సంఘo ఆధ్వర్యంలో లైన్మెన్ శ్రీధర్కు గ్రామస్తులతో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎర్మ పున్నం మాట్లాడుతూ.మండలంలోని రొయ్యలపల్లి గ్రామం గొల్లవాడలో పాత ట్రాన్స్ఫార్మర్ను తొలగించి, కొత్తది ఏర్పాటు చేసినప్పటి నుండి హై ఓల్టేజ్ విద్యుత్ సరఫరా అవుతోందని తెలిపారు. "ట్రాన్స్ఫార్మర్కు ఎర్తింగ్ సరిగ్గా లేకపోవడం వల్లే నెల రోజులుగా షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నాయి. దీనివల్ల ఇళ్లలోని త్రాగునీటి మోటార్లు కాలిపోయి ప్రజలు నష్టపోతున్నారు. గతంలోనూ ఇలాంటి హై ఓల్టేజ్, షార్ట్ సర్క్యూట్ ప్రమాదాల కారణంగా గ్రామంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు. ఈ తీవ్రమైన సమస్యపై విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేయగా, వారు కేవలం తాత్కాలికంగా రిపేర్ చేసి వదిలేశారే తప్ప, శాశ్వత పరిష్కారం చూపలేదని మండిపడ్డారు.మరోసారి అలాంటి ప్రాణ నష్టం జరగకముందే అధికారులు స్పందించి, తగిన జాగ్రత్తలు తీసుకొని సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కోర్తే సమ్మయ్య, గ్రామస్తులు కొండగుర్ల రాజన్న, జిమిడే రాజమల్లు, కోట సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Vastava Gamyam