వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 30 :మంచిర్యాల జిల్లా అదనపు జిల్లా కలెక్టర్ (లోకల్ బాడీస్) ఈరోజు మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని చత్లాపూర్ గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. డంపింగ్ యార్డు నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ విధానాలను మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ ఈ. వసంత్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఎం. గోపీకృష్ణ అదనపు జిల్లా కలెక్టర్కు వివరించారు.సందర్శన సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2026 మార్గదర్శకాల ప్రకారం తడి చెత్త, పొడి చెత్త, హానికర వ్యర్థాలు , శానిటరీ వ్యర్థాలను తప్పనిసరిగా వేర్వేరుగా సేకరించి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అదనపు జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డులో పరిశుభ్రతను మరింత మెరుగుపరచడంతో పాటు ఘన వ్యర్థాల నిర్వహణను నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.అనంతరం మందమర్రి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించిన అదనపు జిల్లా కలెక్టర్, ఇటీవల అకౌంట్స్ విభాగంలో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, కార్యాలయ నిర్వహణను మరింత పటిష్ఠంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.తదుపరి మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని మీ సేవా కేంద్రాన్ని సందర్శించిన ఆయన, అక్కడ సేవలు పొందుతున్న ప్రజలతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆరా తీశారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారి పి. కృష్ణ ప్రసాద్, మున్సిపల్ మేనేజర్ ఈ. రాజేశ్వరి, సంబంధిత అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం