వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 30: మందమర్రి పట్టణ ప్రజలకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను వేగవంతంగా అందించేందుకు కృషి చేస్తామని లయన్స్ క్లబ్ ఆఫ్ మందమర్రి నూతన కార్యవర్గం సభ్యులు తెలిపారు.మందమర్రి పట్టణంలోని శ్రీకృష్ణ గార్డెన్స్లో లయన్స్ క్లబ్ ఆఫ్ మందమర్రి 2026–27 సంవత్సరానికి నూతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్షుడిగా పెండ్యాల గౌతమ్ చారి, కార్యదర్శిగా ఎండి జాకీర్, కోశాధికారిగా బుర్ర ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అనంతరం రిక్కల నారాయణరెడ్డి నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ, దేశ, రాష్ట్ర స్థాయిలో లయన్స్ క్లబ్ సేవలకు విశేష గుర్తింపు ఉందని పేర్కొన్నారు. లక్షలాది మందికి ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి కంటి వెలుగును ప్రసాదించిన ఘనత లయన్స్ క్లబ్కే దక్కిందన్నారు. అలాగే విద్య, వైద్యం, పర్యావరణం, సామాజిక సేవ తదితర రంగాల్లో దేశవ్యాప్తంగా క్లబ్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమని తెలిపారు. మందమర్రి పట్టణంలో కూడా ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్ సతుకు సుదర్శన్ , ప్రోగ్రాం కో-చైర్మన్ పోలు శ్రీనివాస్, అరసవెల్లి శ్రీనివాస్, కొక్కుల మధు, తౌటం శ్రీనివాస్, కౌట్ల అనితతో పాటు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం