వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : 25: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శాఖల వారీగా సాధించిన లక్ష్యాలు, ప్రజల సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర డాక్యుమెంటేషన్ రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు.నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో సాలిడ్, లిక్విడ్ వ్యర్థాల నిర్వహణ, తెలంగాణ జలసిరి కార్యక్రమం, ఇంకుడు గుంతలు, పంటకుంటల ఏర్పాటు వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆరోగ్య పరీక్షలు, విద్యార్థుల యూనిఫారాల తయారీ, మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. అలాగే మాదకద్రవ్యాల నిర్మూలన, పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన, విద్యాభివృద్ధి, పింఛన్ల జీవన ప్రమాణీకరణ, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలు వంటి అంశాల్లో అధికారులు చురుకుగా పనిచేయాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో జిల్లాలో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 10,305 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 2,132 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని వెల్లడించారు. బడిబాట, క్షయ నిర్మూలన, రహదారి భద్రత, బాలికల విద్య, రైతు అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.అనంతరం మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కమిషనర్ గ్రామపంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని, పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ నియంత్రణ, వీధిదీపాల నిర్వహణ, గ్రామ ఆర్థిక వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
Reporter
వాస్తవ గమ్యం