వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఆర్చి లైట్ కంపెనీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో మందమర్రి టోల్గేట్ వద్ద పెట్రోలింగ్ వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు, ఆర్పీఓలు నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు ఐఎఫ్టీయూ నాయకులు మాట్లాడుతూ, తమ పోరాటాల ఫలితంగా గతంలో కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, జీవో ప్రకారం కనీస వేతనాలు, పండుగ రోజుల్లో డ్యూటీ చేసిన వారికి డబుల్ వేతనం, జాతీయ పండుగ మాస్టర్లు తదితర హక్కులు సాధించుకున్నామని తెలిపారు. అయితే ఇటీవల ఈ టోల్గేట్కు ఇన్చార్జిగా వచ్చిన జితేందర్ కార్మికుల మధ్య విభేదాలు సృష్టిస్తూ, యూనియన్కు దూరంగా ఉండాలని ప్రలోభపెట్టారని ఆరోపించారు. అనంతరం పాత డ్రైవర్లను తొలగించి కొత్త డ్రైవర్లను నియమించడం, యూనియన్తో కుదిరిన ఒప్పందం కంటే తక్కువ వేతనాలు చెల్లించడం, పీఎఫ్ నిధులను తక్కువగా జమ చేయడం, పండుగ రోజుల్లో డ్యూటీ చేసిన వారికి అదనపు వేతనాలు ఇవ్వకపోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.డ్రైవర్లు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కంపెనీ యాజమాన్యం కాలరాస్తోందని, అందుకే ఆర్చి లైట్ కంపెనీకి వ్యతిరేకంగా సమ్మె చేపట్టినట్లు తెలిపారు. ఈ సమ్మెకు భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టీయూ) పూర్తి మద్దతు ప్రకటించింది. కార్మికులు కోల్పోయిన హక్కులను పునరుద్ధరించే వరకు, అలాగే అక్రమంగా తొలగించిన అంబులెన్స్ డ్రైవర్ను తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని ఐఎఫ్టీయూ నాయకులు స్పష్టం చేశారు.ఈ సమ్మెలో మంచిర్యాల జిల్లా ఐఎఫ్టీయూ కార్యదర్శి డి. బ్రహ్మానందం, జిల్లా నాయకులు ఎస్. తిరుపతి రెడ్డి, ఎండీ జాఫర్ పాల్గొని తమ మద్దతు తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం