వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం వందలాది మంది వచ్చే ప్రభుత్వ కార్యాలయం ఎదుటే మద్యం సేవించడం పరిపాటిగా మారిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం ఉదయం మందమర్రి ఎంపీడీవో కార్యాలయం ప్రాంగణం ముందు మద్యం సీసాలు, ఖాళీ బాటిళ్లు కనిపించడంతో కార్యాలయానికి వచ్చిన ప్రజలు, అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. స్థానికుల కథనం ప్రకారం, రాత్రి వేళల్లో కొందరు మందుబాబులు ఎంపీడీవో కార్యాలయం పరిసరాలను అడ్డాగా మార్చుకుని బహిరంగంగా మద్యం సేవిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మద్యం సేవించిన అనంతరం ఖాళీ సీసాలు, వ్యర్థాలను అక్కడే వదిలివెళ్లడంతో ప్రభుత్వ కార్యాలయ పరిసరాల పరిశుభ్రత దెబ్బతింటోందని, కార్యాలయానికి వచ్చే మహిళలు, వృద్ధులు, ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమైనప్పటికీ, కొందరు నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాత్రి వేళల్లో పోలీసు నిఘా పెంచాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించి కార్యాలయ పరిసరాల్లో భద్రత, పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని పలువురు కోరుతున్నారు.
Reporter
వాస్తవ గమ్యం